వైసీపీ కాపు నేతలతో ముద్రగడ పద్మనాభం సమావేశం.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు

  • కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లిన వంగా గీత, జ్యోతుల చంటిబాబు
  • అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేతలు
  • ఇటీవలే తుని రైలు దగ్ధం కేసులను ఎత్తివేసిన వైసీపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కూడా స్పష్టతనిచ్చారు. ఈ క్రమంలో మరో 9 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా కాపు నేత ముద్రగడ పద్మనాభంతో వైసీపీ కాపు నేతలు భేటీ అయ్యారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లిన నేతలు ఆయనతో అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పలువురు ఎంపీపీలు, కాపు నేతలు వీరిలో ఉన్నారు. ఈ విందు రాజకీయం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 

ముద్రగడ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో కూడా లేరనే విషయం తెలిసిందే. కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో తునిలో రైలుకు నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించిన కేసులతో ముద్రగడ బాగా ఇబ్బంది పడ్డారు. అయితే, వైసీపీ ప్రభుత్వం ఇటీవలే ఆ కేసులన్నింటినీ ఎత్తివేసింది. ఈ క్రమంలో వైసీపీ కాపు నేతలు ముద్రగడతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Mudragada Padmanabham
Kapu
YSRCP
Meeting

More Telugu News